కాళేశ్వరం విచారణ.. హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- పీసీ ఘోష్ కమిషన్ ను హైకోర్టు తప్పుబట్టలేదన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
- మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పిందని వ్యాఖ్య
- కమిషన్ నియామకాన్ని కోర్టు సమర్థించిందన్న మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న కేసీఆర్, హరీశ్ రావు, కొందరు అధికారులపై తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ తీర్పును బీఆర్ఎస్ నేతలు క్లీన్ చిట్గా భావించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టు ఎక్కడా పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును తప్పుబట్టలేదని, దాని నియామకాన్ని పూర్తిగా సమర్థించిందని మంత్రి గుర్తు చేశారు. మేడిగడ్డ సహా మూడు బ్యారేజీలలో లోపాలు ఉన్నాయని కమిషన్ స్పష్టంగా చెప్పిందని, ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్న వాస్తవంలో మార్పు లేదని తెలిపారు.
హైకోర్టు తీర్పుపై రేపు జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం తన తదుపరి అడుగులను ప్రకటిస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.